Sunday, February 14, 2021

Chalam & Ramanan - long post by Abdul Raza Hussain

 

చలం ...అచలం..9
చలం గారి మ్యూజింగ్స్ పై రమణుల ప్రభావం.!!
చలం గారి మ్యూజింగ్స్ లో ”రమణ మహర్షి “ ప్రభా
వం కనబడుతుంది.చలంగారిలో ఆధ్యాత్మిక ధోరణికి ఎవరు కారణమన్నదానిపై ‘ రా.రా. ‘లాంటి వారు
కూడా తటపటాయించడం ఆశ్చర్యమనిపిస్తుంది .
*”సమకాలీన సమాజంలో ప్రజలు విశ్వసించే ధర్మాలను ,నీతులను లక్షసార్లు నిర్ద్వంద్వంగా
ఖండించిన చలం ,ఆథ్యాత్మిక దృష్టిని ఎప్పుడు తెచ్చుకున్నాడో ,ఎందుకు వచ్చిందో వివరిం
చాలంటే ' చలాన్ని రొమాంటిక్ ‘ గా పరిశీలన చేయాలని “ అభిప్రాయపడ్డారు రా. రా .
చలం గారు ఆధ్యాత్మికత వైపుకు మళ్ళడానికి కారణాల్ని వెదకాలంటే ఆయన ,సాహిత్యం
(పాత్రలు) ద్వారానే సాధ్యమన్నది రా. రా .గారి అభిప్రాయం.‌నిజానికి చలం గారి సాహిత్యం,
జీవితం వేరుకాదు. ఆయన జీవితంలో ఎదురైన అనుభవాలు, తటస్థపడిన పాత్రలే ఆయన
సాహిత్యంలో చోటుచేసుకున్నాయి. చలంగారు సాహిత్యంలో అనుసరించిన విప్లవాత్మక ధోరణి
ఛాయలే ఆయన పాత్రల పై వున్నాయి.
“నా బావ మీది కోపమే‌‌ అంతర్భూతంగా నా కథల్లో పలికిందేమో?సంఘాన్ని ,ఏం చెయ్య లేక నాలోని
కోపాన్నంతా... ఆ కథల్లో వొలకబోసినట్టున్నాను.” (చలం. ఆత్మకథ పే 13) ఇలాంటి వివిధ సందర్భా
ల్లోని అనేక సంఘటనలు, వ్యక్తుల సమాహారమే చలం సాహిత్యం.చలం గారి పాత్రలన్నీఆయన ..
నిజ జీవితంలోనివే .
సమాజం పట్ల చలంగారు తీసుకున్న తిరుగుబాటు ధోరణే ఆయన సాహిత్యంలో ప్రతిఫలించింది.అప్ప
టి సాంప్రదాయిక సమాజం దీన్ని జీర్ణం చేసుకోలేక పోయింది.ఫలితంగా చలం గారిని బహిష్కరించే
వరకు వచ్చింది. చలం గారంటే సమాజంలో ఓ రక
మైన హేయభావం కలిగింది. చలంగారిని,ఆయన
కుటుంబంపట్ల చిన్నచూపు మొదలైంది.ఫలితంగా చలం గారు ఒంటరివాడై పోయాడు.
“ కథల ద్వారా నేను కొట్టే దెబ్బలకి ఎవరూ ఎదురు పలకక దిమ్మతిరిగి పడుకుంది తెలుగు పాఠక‌ ప్రపం
చం.‌కాని దాని రొద నాకు వినబడుతోనే వుంది.పాఠ
కలోకం నుంచి అవ్యాజమైన బాధారవమే నా కెంతో ప్రోత్సాహమిచ్చేది. త్వరలోనే ఆ పాఠకులు నా…..
చుట్టూ చేరుతున్నారు. నా శైలి గొప్పదని దాన్ని ప్రతివారు అనుసరించాలని చూశారు . ఈనాటికీ అది ఎవరి శక్యం కాలేదు .‌ కాని సాహసించి నాతో సహవాసం చేసే యువకులు నేను రాసినశృంగార
పు,నా విప్లవ భావాలకి వాటి ఆచరణకు తట్టుకో లేక ఎక్కిరించి , భయపెట్టే వారి ధాటికి తాళలేక బావురుమంటో భయపడి నన్ను ఒదిలి పోయే వారు.”!(చలం.ఆత్మ కథ..73)
ఈ పరిస్థితి రాను రాను ఎక్కువైంది.చలం గారు క్రమంగా మౌనం వహించడం మొదలు పెట్టారు.
ఇంట్లో పరిస్థితి కూడా బాగోలేదు.చివరకు పరిస్థితి కుటుంబం అంతా సామూహికంగా ఆత్మహత్య
చేసుకునేదాకా వచ్చింది.
*”నేనెప్పుడూ బెజవాడలో వుండేవాణ్ణి కాదు.నాకు బదిలీ అయినప్పుడల్లా ‘ షౌ ‘ నాతో వచ్చి అక్కడే వుంటో వుండేది.ఎప్పుడు కొంచం పండగ శలవలు వొచ్చినా బెజవాడకు పరిగెత్తుకొస్తో వుండే వాణ్ణి.
ఈ జీవితం ఇట్లా చాలా కాలం సాగదనీ ,ఎప్పుడో ఇదంతా బ్రేక్ అయిపోతుందనీ నాకు చాలా సార్లు అనుమానం కలిగేది.ఎప్పుడు మాకు బతకడం
సంతోషంగా లేకపోతుందో అప్పుడు అందరం కలిసి
ఆత్మ హత్య చేసుకుందామని నిశ్చయించుకున్నాం.
నేను లోకంలో ముసలి వాళ్ళను చూసిన కొద్దీ ... వాళ్ళ చాదస్తాలు,వాళ్ళ జీవితాలు అసహ్యంగా,
దుర్భరంగా అందవికారంగా ,పరస్పర పీడింపులుగా వుండటం చూశాను.ఏమైనా సరే 50వ యేడు నిండ
గానే ఇంక ఈ లోకంలో నేను వుండ కూడదని తీర్మా
నించు కున్నాను…..నేను ఎప్పుడూ జీవితానికి అంచునే నడుస్తున్నాను…
1936 నుంచి నా లోపలి సంతోషం పూర్తిగా ఫెయిల్ అయింది.నన్ను పెద్ద అశాంతి పట్టుకుంది.ఎన్నడూ
లేని ఘోరమైన మనోస్థితిలో పడ్డాను.నాకు నేనే
భయంకరుణ్ణి అయ్యాను.ఆ విధంగా ఇంకా కొంత
కాలం వుంటే నేనేమయేవాణ్ణోతెలియదు.”!.
అంటూ చలంగారు మధనపడ్డారు.
చలంగారు 1936లో పడుతున్నస్ట్రగుల్,అనుభవి
స్తున్న మనోవ్యధ చూసి ,ఆయన కొలీగ్,మిత్రుడు చింతా దీక్షితులు గారు చలం గారిని రమణాశ్రమా
నికి తీసుకు వెళ్ళారు.అక్కడ రమణుల వారిని
దర్శించుకొని ,తిరిగి వచ్చాక కొంతకాలం రచనల
కు బ్రేక్ ఇచ్చారు.ఓ పక్క మానసిక సంతులనం లేకపోవడం,మరో పక్క రమణుల వారి గురించిన
ఆలోచనల మధ్య కాలం గడిచిపోయింది.1937లో
మ్యూజింగ్స్ రచనకు శ్రీకారం చుట్టారు.సుమారు దశాబ్దిన్నర కాలంలో (1955వరకూ ) మ్యూజింగ్స్
రాశారు.1950లో శాశ్వతంగా రమణాశ్రమం చేరే
వరకు ఈ మధ్యకాలం (13,సంవత్సరాలు )చలం
గారి జీవితంలో కీలక దశగా చెప్పుకోవచ్చు.
1937 లో ‘రమణుల ‘ వారి చింతనలో వున్నారు.
కుమారుడు 'రవి ‘ మరణం వల్ల కలిగిన దుఃఖంవల్ల తాను పోగొట్టుకున్న జీవితానురక్తి మళ్ళీ రమణుల
వారి వల్లనే కలిగిందంటారు చలం.ఆధ్యాత్మిక అను
భవం మనుషుల్లో. (ముఖ్యంగా తనలో ) మార్పు తేగలదన్న నమ్మకం కలిగింది.1939,40,41 లలో భగవాన్ తరచూ చలం గారి కలలో కనిపిస్తుండే వారట.ఆ కలల్లోని దృశ్యాలకు అర్థాలువెదుక్కుంటూ
,విశ్లేషించుకుంటూ,వుండేవారు. చలం గారు(1940.
10..9 ) ఓ లేఖలో ఇలా..... రాసుకున్నారు.
*If You depend on experience alone .You will have to take others experience as your own experience.”.
1937లో రాసిన మరో ఉత్తరంలో చలం గారు ఏమన్నారో చూడండి.
"కాముకుడు,కథకుడు చలంచచ్చిపోతున్నాడు.
అప్పుడే భగవాన్ కొంచెం ముక్క తినేశారు.అతని
లో,నాకేదో సాక్షాత్కారమైందనుకోకండి .కానీ….
నాలోని ఈ కాస్త మార్పే గాలిని మరింత చల్లగా
నూ,కాంతిని ఎక్కువ తేజోవంతంగాను ,సముద్రా
న్ని ఇంకా నీలంగానూ మార్చింది.ద్వేషాలే కరిగి
పోతున్నాయి!మానవుల మీద కొత్త ప్రేమ ఉదయిం
చింది.”( చలం సాహిత్య సాదృశ్యం..ఎస్ రామ
చంద్ర.పే.150)..
ఇలా చలం గారిలో 1937నుంచే రమణుల వారి
గురించి నిరంతర చింతన చోటుచేసుకుంది. “ఆడపిల్లల నుంచి నేను పొందిన ఆనందం కన్న
గొప్ప ఆనందాన్ని ఇస్తానంటున్నారు “భగవాన్ “
ఆ ఆనందం కోసమే నా అన్వేషణ.”(చలం శశాంక
పే 71)
“ఆధ్యాత్మికంగా అభివృధ్ధి కనబడుతోంది నాలో.
ఇప్పుడు నేను భగవాన్ భక్తుణ్ణి అనడానికి సంశయించను. "
“తిని,సంభోగించి,సంతోషించి ,తృప్తిపడే మృగాలకు తప్ప అట్లా కాని మనబోటి వాళ్ళకి భగవాన ఒక్కడే ఆశ” (చలం.శశాంక 72,73,పే)
ఇలా ‘చలం ‘ గారు తన్ను తాను ఆధ్యాత్మికప్రపంచం
లోకి తెచ్చుకున్నారు.కానీ శుక్రదశ చలం గారి జీవితా
న్ని మళ్ళీ వెనక్కుతిప్పింది ‘ లీల ‘ గారి ప్రవేశం ..
(1942) తో పాత చలానికి మళ్ళీ ఊపిరి వచ్చింది.
అయినా..తన ఆలోచన మాత్రం పరిపక్వతవైపే వుందని చలం గారే స్వయంగా చెప్పుకున్నారు.
*”నేనింకా పరిపక్వం కాలేదు. ఏదీ అందుకో లేదు.
ఎప్పుడు? ఎట్లా? అనికాలుతున్నాను.అదొక్కటే
నా కోర్కె.అదే నా ఆశయం.శుక్రుడు తిరిగి స్త్రీలను తన జీవితంలోకి తెస్తున్నాడని,తిరిగి ఆ మోహ సంబంధాలలో వెళ్ళకుండా భగవాన్ రక్షిస్తున్నారని చలం గారే .....చెప్పుకున్నారు.“..( శశాంక .పే!67)
ఈ శుక్రుడి ప్రభావంతోనే 1940లో “ప్రేమ లేఖలు “ రాశారు.ఈ ప్రేమ లేఖల్లో కూడా రమణులవారి “నేను “ గురించి చింతన కనబడుతుంది.
“నేను అనేది అంతా నా అహం.నా జీవమే అది
ఈ కలలతోనే ,యీ అగ్నితోనే ,యీ వ్యర్థ ప్రయ
త్నాలతో,యీ ప్రేమలతో సృష్టిని పెనవేసుకొని పుట్టాను.వాటిని నశింపజేస్తే “నేను” అనేది నశించి
నట్టే.”(ప్రేలేఖలు..పే.189) ఇలా చలం గారు శుక్రుడి ప్రభావంలో వున్నాకూడా రమణులవారి గురించి న ఆలోచన మాత్రం పోలేదు. ( మ్యూజింగ్స్ లోకూడా
ఇదే రకమైన చింతన అక్కడక్కడా కనబడుతుంది.)
*మ్యూజింగ్స్..!!
1937లో మ్యూజింగ్స్మొదలుపెట్టారు.విశాఖపట్నంకు బదిలీ అయింది.అప్పుడే బ్రాహ్మణీకం నవల, విచిత్ర నళీయం కథలు కూడా రాశారు. 1938 అవధూత. పిచ్చమ్మ గారితో పరిచయం.ఆ ప్రభావంతో ‘ అరుణ
నవల రచన.1939లో రెండో సారి అరుణాచలం
వెళ్ళారు.1941,లోకుచేల,సీత,అగ్నిప్రవేశం,నరసింహావతారం,ద్రౌపది.సత్యవంతుడు రచనలు చేశారు.
1942లో అమీనా పూర్తిచేశారు.లీల గారి ప్రవేశం
యశోదా గీతాల రచన,భగవాన్ పాదాల ముందు విన్నపాలు.1945లో భర్య రంగనాయకమ్మ గారు అరుణాచలంలో నివాసం ఏర్పరుచుకున్నారు.
లీలగారితో సహజీవనం((1942నుండి 1949) 1947లో పురూరవ రచన.కుమారుడు 'వసంత్ అదృశ్యం 1948లో ఉద్యోగవిరమణ,!డా.రంగనాయ
కమ్మ (వొయ్యి ) మరణం,జీవితాదర్శం రచన.1949
లీలగార దూరం కావడం,వాళ్ళు నలుగురు కథా
రచన.1950 ఫిబ్రవరిలో అరుణాచలంలో స్థిర నివాసం.1951 ఏప్రిల్లో రమణులవారి నిర్యాణం.
1951లో అనార్కలి సినిమా రచన కోసం మద్రాసు
కు వెళ్ళడం,అక్కడ ఇమడ లేక తిరుగు ప్రయాణం.
1951లో సౌరిస్ కు ఈశ్వర దర్శనం.1955వరకు మ్యూజింగ్స్ రచనల కొనసాగింపు.
*మ్యూజింగ్స్ పై రమణుల వారి ప్రభావం..!!
చలంగారి లో వేదాంత ధోరణి ,ఆధ్యాత్మికత 1936 అంటే రమణుల వారి దర్శనం తర్వాతనే కనిపి
స్తోంది.నిరీశ్వర వాదియైన చలం గారు రమణుల దర్శనం తర్వాతే ఈశ్వరుడిని నమ్మాడు. కొలిచాడు.
ఈశ్వర దర్శనం కోసం ఎదురు చూశాడు. 1937లో ప్రారంభించిన 'మ్యూజింగ్స్ 'లో చాలా చోట్ల చలం గారి వేదాంత ప్రస్తావనలు,చర్చ ,ఈశ్వర ప్రస్తావన కనిపిస్తాయి.
"ఆధ్యాత్మిక విద్యే అన్నిటికన్నా గొప్ప సుఖమిస్తే
అది చాలా వాంఛనీయం.(మ్యూ.పే203)
ఆధ్యాత్మిక విద్య అదో విద్య .దానికి మార్గాలు,
మెట్లూ అన్నీ రాసేశారు.( మ్యూ...పే204)
"ఈశ్వరుణ్ణి నమ్మేవాళ్ళు ..ప్రపంచం చాలా ధర్మన్యాయబద్ధమనిన్నీ ,ఈ దుష్టతొవమంతా
‌మానవుడి చాతగానితనమో యాసిడెంట్ ఓ..అంటారు “( మ్యూ..పే.218)
“ఆధ్యాత్మిక మార్గం ,ప్రేమ యాత్ర,ఈశ్వరుడితో దోబూచులాటలు ,సరసాలు,సల్లాపాలు,అన్ని
ఆనందాలలో ,లీలలలో ..ఈశ్వరుణ్ణి హృదయం
లో సాక్షాత్కరింప చేసుకోడమని మరచారు'.
(మ్యూ..పే.366),
* రమణుల వారి “నేను” !!
*”ఈ “ నేను “ జీవితానికంతా పునాది గనకనే ,
ఈ ‘ నేను ‘ ను పట్టుకొని ఇట్లా వేళ్ళాడతారు.
మనుషులు.ఆ 'నేను’ లో నుంచి 'నాది’ పుడుతుంది!పొట్ట మీద పాకే పిల్ల “నాది “అన లేక
మొదటిసారి “అది” అనేటప్పటికల్లా అవును ఆ “నాది “ నీ దుఃఖాలకంతా 'ఆది’ అనుకుం టాను.
ఈ “నేను “ ఈ “నాది “ అనుకునేవాటిని అన్నిటినీ విడిచిపోవాలి.ఎప్పుడో ఒకప్పుడు.
అందుకనే ఎట్లాగో ఓలాగు ఆ 'నేను’ ని ఇక్కడే వుంచాలని, వొదలాలని వెర్రిప్రయత్నాలు
చేస్తాడు.”...(మ్యూజింగ్స్ పే 50)
*అన్నిట్లోకి అన్యాయం ఈ వైరాగ్య‌ బోధ….
చావడమంటే అర్థం ఈ “నేను “అనే భావం నశించడం.ఈ "నేను " అనేది రెండు విధాల
నశించ వచ్చు . ఈ దేహంతో పాటు అదీ …
పోవచ్చు. అనేక జన్మల తర్వాత మాయం కావచ్చు.(మ్యూ..పే196)
*నేను” అనేది తక్కిన వాటికన్నా భిన్నం
కావడం వల్లనే నిలిచి వుంది.”(మ్యూ.పే‌198)
*”కాని మృత్యువుతో ఆఖరైతే ఈ “"నేను” కి ఇంత గొప్పగా సమర్థించుకుననే with its assurance and insistence and feeling of permanance.
ఆ “ నేను “ కి అర్థం లేదు.”(మ్యూ.పే199)
”ఈ బాధలు పడేందుకు ఒక “నేను “ వుంది.దానికి అతుక్కొని ఒక దేహం వుంది.ఆ “నేను”లేకపోతే
దేహం బాధించదు!(మ్యూ.పే.200)
“నేను “గురించిన తలపోత రమణుల వారి దగ్గర
నుంచి చలం గారికి సంక్రమించింది.తొలి సారి
దర్శనంలోనే భగవాన్ “నేను “ గురించిన బోధను చలం గారు మనసుకు ఎత్తుకున్నారు.దానిప్రభావ
మే మ్యూజింగ్స్ లో ఈ “నేను “ గురించి చలం గారి వేదాంత చర్చ.
*భగవాన్ ‘ ప్రస్తావన..!!
*”భగవాన్ ను చూస్తే లోకంలోఅందం ,అధికారం,
శాంతి,క్షమ,దయ,ప్రేమ అన్ని విలువల్నీ అవలీలగా
తనలో ఇముడ్చుకొనిళ,దాటి,ఏదో విశ్వ తేజస్సులో వెలుగుతున్నట్లుంటుంది.”(మ్యూ.పే205)
“భగవాన్ ని తలచుకుంటే నేనట్లా అవుతాను. “ఏం చెయ్యలేనా?‌నా కృతజ్ఞతాభారాన్ని ఏ విధంగానూ
తీర్చుకో లేనా?అని కొట్టుకుపోతాను.(మ్యూ...పే.250)
*లీలగారిలో భగవాన్ !!
“ఆమె (లీల)గారి కళ్ళల్లో నాకు భగవాన్ కనబడతారు!..నా అంతరాంతరమైన అవసరాన్ని గుర్తించితన అపారమైన దయతోవనా చివరి తృషతణని తీర్చకనికరించి ,ఆమె సుందర రూపాన్ని ధరించి నా చేతుల్లోకి వచ్చింది.భగవానే!
నా అనుభవం,ఆధ్యాత్మికం కాకపోతే యింక ఏదీ కాదు..” అంటూ..‘లీల ‘ గారు సాక్షాత్తు భగవాన్ వరప్రసాదమని దీక్షితులకు రాసిన ఉత్తరంలో పేర్కొన్నారు చలం.
( మ్యూజింగ్స్ (పే149,163 ,171,216,318,325 లో లీలగారి ప్రస్తావన కనబడుతుంది.)
*లీలగారు నన్ను వెదుక్కుంటూ రావడమనేది భగవాన్ అనుగ్రహం అనే విశ్వాసం నాకు పోదు…. లీల గారి స్నేహం భగవాన్ ఉద్దేశ్యమనిపిస్తుంది ఈనాడు. భగవాన్ ఉద్దేశమంటే ఉద్దేశ్యమని
నా ఉద్దేశ్యమన్న మాట. కాకపోతే ఆనాడు ఆధ్యాత్మిక సౌధనానికి అంత చేరువగా ఐన నన్ను
మళ్ళీ శృంగారంలోకి అనాయాచితంగా అప్రయత్నంగా భగవాన్ మళ్ళించవలసిన పనేముంది? (మ్యూ.పే325)
దీక్షితులు గారు పరిచయమయ్యే దాకా ఆచారాలు
మూఢనమ్మకాలు,మతం,కట్టుబాట్లకు వ్యతిరేకంగా
వున్న చలంలో అనూహ్యమైన మార్పు వచ్చింది.
అప్పటి నుంచే జాతకాలు,నమ్మకాలు,గ్రహశాంతులు సూర్యనమస్కారాలుయోగాసనాలు,కార్తీక సోమ
వార వ్రతాలుతీర్థయాత్రలు ప్రారంభమయ్యాయి.
రమణుల వారి దర్శనంతో చలం గారి ఆలోచన
లో క్రమంగామార్పు వచ్చింది.ఆ మార్పే మ్యూజింగ్స్ లో వేదాంత చర్చ,ఈశ్వరుడిపై నమ్మకం, భగవాన్
తలపోత వంటి విషయాలకు చోటిచ్చాయి.
అంతే కాదు.. సాక్షాత్తు భగవానే “ లీల “. గారి
రూపంలో వచ్చారని చలం గారు నమ్మడం ఆయన
పై రమణులవారి ప్రభావాన్ని,గాఢమైన ‌ ముద్రను
తెలియజేస్తుంది.
అటు జీవితంలోను ,ఇటు రచనల్లోనూ విశృంఖల శృంగారానికి అలవాటుపడిన చలం గారు
రమణుల వారి దర్శనం తర్వాతనే తాత్విక చింతనలో పడ్డాడని చెప్పడంలో ఎటువంటి
సంశయం, సందేహం అక్కరలేదు.అలాగే మ్యూజింగ్స్ లో కూడా రమణుల వారి ప్రభావం
కనిపిస్తుందని చెప్పడం కాదనలేని నిజం.!!
(ఇంకా వుంది)

No comments: